కలం, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మెమో జారీ చేశారు. మంత్రి సీతక్క సిఫార్సు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అంగన్వాడీ సిబ్బందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీతక్క వెల్లడించారు. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ నిర్ణయమే ఉదహరణ అన్నారు.
మరొకరిని నియమించకపోతేనే..
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మెమో జారీ చేశారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, ఎన్నికల్లో విజయం సాధించని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల అప్పీళ్లను పరిశీలించనున్నారు. వారి స్థానంలో ఇప్పటికీ మరొకరిని నియమించకపోతేనే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నారు. అర్హులైన వారి అభ్యర్థనలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి వారి పునర్ నియామకం చేపట్టనున్నట్లు వివరించారు.

