కలం, స్పోర్ట్స్ : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి క్రికెట్ పండుగ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సిద్ధమైంది. ఈ ఏడాది టోర్నమెంట్ జూన్ 9 నుంచి విశాఖపట్నం వేదికగా ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేసినేని శివనాథ్ అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది ఏపీఎల్ సాధించిన అద్భుత విజయం తర్వాత, ఈ సారి మరింత ఉత్సాహంతో లీగ్ను తిరిగి తీసుకురావడం గర్వంగా ఉందని శివనాథ్ మీడియాకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సారి టోర్నమెంట్ షెడ్యూల్, నిర్వహణను గతానికంటే భిన్నంగా ప్లాన్ చేశారు. ఈ ఏడాది మ్యాచ్లు మొత్తం మూడు వేదికల్లో జరగనున్నాయి. విశాఖపట్నం, కడప,, రాజధాని ప్రాంతమైన అమరావతిలోని మంగళగిరిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి వేదికలోనూ ఆరు రోజుల పాటు మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ ముగింపు ఘట్టమైన ఫైనల్ మ్యాచ్కు మంగళగిరి వేదిక కానుంది. ఈ గ్రాండ్ ఫైనల్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సీజన్లో కూడా గత ఏడాది లాగే మొత్తం ఏడు జట్లు తలపడనున్నాయి. కొత్తగా ఎలాంటి జట్లను చేర్చలేదు. టోర్నీలో ప్రతి జట్టు ఎనిమిది మ్యాచ్లు ఆడుతుంది. గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఎంతో మేలు చేసే ఈ టోర్నీకి మీడియా కూడా పూర్తి మద్దతు అందించి, మరింత విజయవంతం చేయాలని శివనాథ్ కోరారు. పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్లకు ఆయన అభినందనలు తెలియజేశారు.

