కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్న వారంతా ఉత్తరాది వారేనని పేర్కొన్నారు. ఈ విమర్శలకు తాజాగా మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పాలన మీద, ఇచ్చిన హామీల మీద ఫోకస్ పెట్టకుండా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దక్షిణాది, ఉత్తరాది మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
హామీలు అమలు ఏమైంది?
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల గురించి ఎందుకు ఆలోచించడం లేదని ఏలేటి ప్రశ్నించారు. 420 హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కట్టిన పన్నుల్లో దాదాపుగా 80 శాతం పన్నులు తిరిగి వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించడం ఆపేసి తాము ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టాలని కోరారు. హిట్లర్, తుగ్లక్ కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో రేవంత్ పాలన అలా ఉందంటూ వ్యాఖ్యానించారు.
ఎవరిని తొక్కారు.. ఏం పొడిచారు?
రేవంత్ రెడ్డి తాను తొక్కుకుంటూ పైకి వచ్చానని చెప్పుకుంటారని. ఆయన ఎవరిని తొక్కారు? ఎవరిని పొడిచారు? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇతరులను నిందించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

