కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ దేశ భవిష్యత్తును వంచిస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. సీబీఎస్ఈ (CBSE) మూల్యాంకన వివాదంపై అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనన్నారు. సమాధాన పత్రాల పునః మూల్యాంకనం కోరినా ఫలితం ఉండదనే భయం వారిలో నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి కారణమైన అవినీతి బీజేపీ వ్యవస్థలో ఎలాంటి మార్పు లేదన్నారు. బాధ్యత వహించే వారు కానీ, రాజీనామా చేసే వారు కానీ కనిపించకపోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.
అధికారం ముసుగులో విద్యా రంగాన్ని గుప్పిట పట్టిన బీజేపీ అనుబంధ శక్తులు, ఇప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. నైతికత గురించి గొప్పలు చెబుతూ, విభజన రాజకీయాలు చేసే స్వయం ప్రకటిత నీతిమంతులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ఆయన ప్రశ్నించారు. యువత భవిష్యత్తును పణంగా పెడుతున్న ఇలాంటి పద్ధతులను సహించేది లేదని, ఇక బీజేపీ వద్దని నినదించాలని ఆయన దేశ యువతకు పిలుపునిచ్చారు.

