కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, రైతును యూనిట్గా తీసుకొని అన్నిరకాల పంటలకు పంటల బీమా అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ రూరల్ సంయుక్త సమావేశంలో ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో వల్ల ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, తీవ్రమైన కరువు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు ముందస్తుగా చేపట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
అఖిల ఏఐయూకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవారాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు 3 శాతం లోపలికి పోయాయని, పరిస్థితి ఇలానే ఉంటే తాగునిటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, బాబన్న, ఉపాధ్యక్షులు రాజన్న, పరమేష్, సహాయ కార్యదర్శులు దామోదర్, కిషన్, కోశాధికారి లింబాద్రి, జిల్లా నాయకులు నారగౌడ్, గంగాధర్, రమేష్, శేఖర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

