విద్యార్థుల గొంతు గెలిచింది: మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ :  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేసిన ఐక్య పోరాటానికి దక్కిన విజయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భమని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి తొలి మెట్టు అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉద్యమం, ప్రతిపక్షాల పోరాటం, ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరంతర ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలనే ప్రతి ప్రయత్నానికి ఈ పరిణామం గట్టి సమాధానమని అన్నారు. విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు విధించడం, విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం వంటి చర్యలు చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును హరిస్తే ప్రజలు మరింత ఐక్యంగా పోరాడతారని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.

ఈ రాజీనామా దేశ ప్రజలలో కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని పేర్కొన్న ఆయన.. విద్య, ఉపాధి, యువత భవిష్యత్తు అంశాలలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>