కలం, ఆదిలాబాద్: గణేష్ ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Adilabad Collector) ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాల శాంతియుత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, విద్యుత్, అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
నిమజ్జన మార్గాల్లో డ్రెయిన్లు, విద్యుత్ వైర్లను ముందుగానే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. మట్టి గణపతుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, జిల్లాలో రెండు వేల మట్టి వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. అనంతరం ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, సబ్కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

