కలం, ఖమ్మం బ్యూరో: వాహనదారులు వాహనం నడిపేటప్పుడు కుటుంబాలను దృష్టిలో ఉంచుకోవాలని, అప్పుడే ప్రమాదాలు నివారించబడతాయని కల్లూరు ఏసీపీ వసుంధర (ACP Vasundhara) స్పష్టం చేశారు. ఏన్కూర్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అపోజిట్ డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడ్ వంటి ట్రాఫిక్ నియమాలను పాటించని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడపటం ప్రమాదకరమని,ఇలా మద్యం సేవించి వాహనం నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు అందజేయవద్దని, అలా చేస్తే వాహన యజమానిపై కేసు నమోదు చేయ బడుతుందని, వాహన దారులు తప్పక హెల్మెట్ ధరించడంతో పాటు లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి వుండాలన్నారు. ముఖ్యంగా వాహనంపై ప్రయాణించే సమయం లో సెల్ ఫోన్ మాట్లాడవద్దని సూచించారు.

