కలం, భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ తనిఖీలకు (ACB Raids) దిగింది. సూర్యాపేట, తాండూరు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. జయరాజ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లితో పాటు హైదరాబాద్ బోడుప్పల్లోని ఆయన నివాసంలో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో, ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఏసీబీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, కీలక పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తనిఖీలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తులు, తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

