కలం, వెబ్డెస్క్: పోలీస్, అగ్నిమాపక శాఖ విభాగాల్లో డ్రైవర్ పోస్టులకు రెండేళ్ల నిరంతర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత ఒక్కరోజు విరామం ఉన్నా దాన్ని నిరంతర లైసెన్స్గా పరిగణించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు పోలీస్, ఫైర్ సర్వీస్ విభాగాల్లో డ్రైవర్ పోస్టుల నియామకాల విషయంలో తెలంగాణ (Telangana) రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. జస్టిస్ ఆషానుద్దీన్ అమానుల్లా, ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాలు ఇవీ.. రాష్ట్రంలోని పోలీస్, ఫైర్ సర్వీస్ విభాగాల్లో 325 డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత నిబంధనల్లో భాగంగా.. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కనీసం రెండేళ్ల పరిమితి కలిగిన ఎల్ఎంవీ/హెచ్ఎంవీ లైసెన్స్ అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది.
దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో తీర్పు వాళ్లకు అనుకూలంగా వచ్చింది. గడువు ముగిసిన తర్వాత రెన్యువల్కు మధ్య విరామం ఉన్నా అది నిరంతర డ్రైవింగ్ లైసెన్స్గానే పరిగణించవచ్చని ఆ తీర్పు సందర్భంగా తెలంగాణ (Telangana) హైకోర్టు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టును రిక్రూట్మెంట్ బోర్డు ఆశ్రయించింది. విచారణ సందర్భంగా బోర్డు వాదనను సమర్థించిన సుప్రీం.. మోటార్ వెహికల్స్(సవరణ) చట్టం–2019 ప్రకారం గడువుతోనే పాత లైసెన్స్ ముగుస్తుందని, తిరిగి రెన్యువల్ చేసుకున్నప్పటికీ దాన్ని నిరంతర లైసెన్స్గా పరిగణించలేమని పేర్కొంది. ఒక్క రోజు విరామం ఉన్నా అది నిబంధనను అతిక్రమించినట్లేనని తేల్చి చెప్పింది. బోర్డు నిబంధనల ప్రకారం అలాంటి అభ్యర్థులు పోలీస్, అగ్నిమాపక విభాగాల డ్రైవర్ పోస్టులకు అర్హులు కాదని తీర్పునిచ్చింది.


