కలం, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కు దేశంలోని ప్రముఖ ఆర్థిక పత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్(The Economic Times)’ నిర్వహించిన ‘ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ 2025’లో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల సంస్కరణలు అమలు చేయడం, పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ, జాతీయ స్థాయిలో స్థిరత్వానికి చంద్రబాబు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రకటనపై ఉదయం ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “గవర్నెన్స్ సంస్కరణలు స్లోగన్ల కంటే బలంగా మాట్లాడతాయి. అత్యంత గౌరవప్రదమైన అవార్డు.. మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్” అంటూ రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ పెంచారు. మధ్యాహ్నం అవార్డు ప్రకటనతో పాటు చంద్రబాబు ఫోటోను షేర్ చేస్తూ లోకేష్ మరో పోస్ట్ పెట్టారు.
‘‘సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) గారు ఎకనామిక్స్ టైమ్స్ నుంచి ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, మా కుటుంబానికి గర్వకారణం. ఈ అవార్డు ఆయన గవర్నెన్స్లో విశ్వాసం పట్ల నిరంతర ప్రయత్నాలకు నిదర్శనం” అని లోకేష్ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు దక్కడంపై రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం
Follow Us On: Youtube


