కలం, వెబ్డెస్క్: మన దీపావళి (Deepavali) కి విశ్వఖ్యాతి దక్కింది. ముంగిట్లో వెలుగు దివ్వెలు.. వాడవాడలా బాణసంచా పేలుళ్లతో దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండగను యునెస్కో (UNESCO) తన ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలోకి చేర్చింది. ఈ మేరకు యునెస్కో ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించగా, ప్రధాని మోదీ రీ ట్వీట్ చేశారు. మన సంస్కృతి, విలువలకు ప్రతీక అయిన దీపావళికి యునెస్కో గుర్తింపు దక్కడం భారతీయులందరికీ గర్వకారణమని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. దీపావళి పండుగ గురించి అంతర్జాతీయంగా వివరించడం, ఈ పండుగ విశిష్టతను కాపాడుతూ భావితరాలకు భద్రంగా అందించడానికి యునెస్కో కృషి చేస్తుంది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్(ఐసీహెచ్) 20వ సమావేశం జరుగుతోంది. ఈ నెల 8న ప్రారంభమైన ఈ సమావేశం 13వరకు కొనసాగనుంది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపద(వరల్డ్ హెరిటేజ్ సైట్స్)కు ఈ ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ విభిన్నం. ఇందులో పండుగలు, ప్రాచీన కళలు, నృత్యం, ఆచారాలు వంటి వాటికి చోటు కల్పిస్తారు. ప్రస్తుతం ఈ బాబితాలో భారత్ నుంచి చేరిన దీపావళి (Deepavali) 16వది. మిగిలినవి కుటియాట్టమ్, వేద పారాయణం, రామ్లీల, రమ్మన్, ఛావూ, కల్బేలియా, ముదియేట్టు, బౌద్ధ స్తుతి, సంకీర్తన, వెండి–రాగి కళాకృతులు, నవ్రోజ్, యోగా, కుంభమేళా, దుర్గాపూజ, గార్భా నృత్యం.
Read Also: టీ20 గెలుపుకు అతడే కారణం: సూర్యకుమార్
Follow Us On: Pinterest


