కలం, వెబ్ డెస్క్: వాంఖడే మైదానం సాక్షిగా టీమ్ ఇండియా గర్జించింది(India Beat England). డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్, ఇంగ్లాండ్ను మట్టికరిపించి 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి ఘనంగా ప్రవేశించింది. పరుగుల వరద పారిన ఈ హై-వోల్టేజ్ సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠ బరితంగా సాగిన పోరులో భారత్ అదరగొట్టింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. బ్యాటర్లలో సంజూ మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్ను 253 పరుగులకు తీసుకెళ్లారు. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆఖరి వరకు పోరాడింది. ఇంగ్లండ్ బ్యాటర్ బెథెల్ సెంచరీ చేసి వీరవిహారం సృష్టించాడు. కానీ చివరి ఓవర్లో దూబేకు వికెట్ సమర్పించుకుని పెవిలియన్ చేరాడు. దీంతో ఈ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఉత్కంఠకు పరాకాష్టగా సాగిన ఈ పోరులో భారత్ జయకేతనం ఎగురవేసింది(India Beat England). టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 253/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ పట్టుదలతో పోరాడి 246/7 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ (89) ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. ఇషాన్ కిషన్ (39), శివం దూబే (43) మెరుపులు తోడవడంతో భారత్ రికార్డు స్కోరు నమోదు చేసింది. చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మెరుపులు మెరిపించి జట్టుకు కొండంత స్కోరు అందించారు.
ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ (105) వీరోచిత సెంచరీతో భారత్ను భయపెట్టినప్పటికీ, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 30 పరుగులు కావాల్సిన దశలో శివం దూబే కచ్చితమైన బంతులు వేయడంతో ఇంగ్లాండ్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్ తీయడమే కాకుండా, ఫీల్డింగ్లో మూడు అద్భుతమైన క్యాచ్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. హార్దిక్ పాండ్యా కీలక సమయంలో సామ్ కర్రన్ వికెట్ తీయడమే కాకుండా, సెంచరీ హీరో బెథెల్ను రనౌట్ చేసి ఇంగ్లాండ్ ఆశలను సమాధి చేశాడు. అర్ష్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీసి ఇంగ్లాండ్ జోరుకు కళ్లెం వేశారు. సంజూ శాంసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కప్ కోసం భారత్ ఈ నెల 8 ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే తుదిపోరులో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంంది.

