కలం, వెబ్ డెస్క్ : హిందూ సంప్రదాయంలో తమలపాకు(Betel Leaves)కు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఏ శుభకార్యం జరిగినా తమలపాకులు ఉండాల్సిందే. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో చేసే పూజ అంటే ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. సృష్టిలో ఎన్నో రకాల ఆకులు ఉన్నప్పటికీ, కేవలం తమలపాకులకే ఎందుకు ఇంతటి పవిత్రత దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సకల దేవతల నివాసం
తమలపాకును ‘నాగవల్లి దళం’ లేదా ‘దేవతాదళం’ అని పిలుస్తారు. ఇందులో సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాల వచనం. ఆకు తొడిమ భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మధ్య భాగంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆకు కొన భాగంలో చదువుల తల్లి సరస్వతీ దేవి నివసిస్తుంది. వీటితో పాటు ఇంద్రుడు, మన్మధుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఈ ఆకులోనే ఉంటారని పెద్దలు చెబుతారు. అందుకే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పూజ చేసినా, ఒక్క తమలపాకు లేకపోతే ఆ కార్యం అసంపూర్ణమే అవుతుంది.
హనుమంతునికి ప్రీతికరం ఎందుకు?
రామాయణంలోని సుందరకాండ ప్రకారం, సీతమ్మ జాడను కనుగొని శ్రీరాముని సందేశాన్ని అందించిన హనుమంతుడికి, సీతాదేవి సంతోషంతో తమలపాకుల దండ వేసి ఆశీర్వదించారు. నాటి నుండి ఆంజనేయుడికి ఇవి అత్యంత ప్రీతికరంగా మారాయి.
తాంబూలం వెనుక ఉన్న అర్థం
తమలపాకులను (Betel Leaves) దైవిక శక్తికి చిహ్నంగా భావిస్తారు. అందుకే నోములు, వ్రతాల సమయంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. కొత్తగా పెళ్లయిన వధూవరులచే తాంబూలం తినిపిస్తే వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని చెబుతారు.
పాటించాల్సిన నియమాలు
పూజలో లేదా శుభకార్యాల్లో తమలపాకులను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పండిపోయిన లేదా ఎండిపోయిన ఆకులను పూజకు వాడకూడదు. ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో చిరిగినవి, తొడిమ లేని ఆకులు ఉండకూడదు. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆయుర్వేద పరంగా కూడా తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
Read Also: తిరుమల పవిత్రతకు విఘాతం: మరో వివాదంలో దివ్వల మాధురి!
Follow Us On: Instagram

