కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్లో సెలెక్షన్ కమిటీ (Pakistan Selection Panel) మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ అంతర్జాతీయ అంపైర్ అలీమ్ దార్ రాజీనామా తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) కొత్త సభ్యులను ఎంపిక చేసింది. తాజాగా మాజీ కెప్టెన్లు మిస్బా-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్ కమిటీలోకి చేరారు. పీసీబీ అధికారిక వెబ్సైట్లో వెల్లడైన వివరాల ప్రకారం సెలెక్షన్ కమిటీ ఇప్పుడు నలుగురు సభ్యులతో కొనసాగుతోంది. ఈ కమిటీలో మిస్బా ఉల్ హక్, సర్ఫరాజ్ అహ్మద్తో పాటు మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ జావేద్, మాజీ టెస్ట్ బ్యాటర్ అసద్ షాఫిక్ సభ్యులుగా ఉన్నారు. అలీం దర్ 2024 అక్టోబర్ 11న సెలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే తక్కువ కాలానికే ఆయన ఈ పదవి నుంచి తప్పుకున్నారు. సెలెక్షన్ సమావేశాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం.
నిర్ణయాల ప్రక్రియలో తన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి ఆయనలో పెరిగిందని వర్గాలు తెలిపాయి. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World Cup) జట్టు ఎంపికపై జరిగిన చర్చల్లో కూడా విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. జట్టులో బాబర్ అజాబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ను చేర్చడాన్ని అలీం దర్ వ్యతిరేకించినట్లు సమాచారం. అదే సమయంలో వికెట్కీపర్-బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్కు మద్దతుగా ఆయన బలంగా వాదించినట్లు తెలిసింది. ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే రిజ్వాన్కు కూడా సమాన మద్దతు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారని వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల తర్వాత పీసీబీ సెలెక్షన్ కమిటీలో (Pakistan Selection Panel) మార్పులు చేసింది. ఇప్పుడు నాలుగు సభ్యులతో కూడిన కొత్త కమిటీ పాకిస్థాన్ జట్టు ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనుంది. ఇక వచ్చే అంతర్జాతీయ టోర్నీలకు జట్టు ఎంపికలో ఈ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Read Also: బల్దియా అప్పులకు విముక్తి.. రూ. 4,780 కోట్ల భారం మోయనున్న ప్రభుత్వం
Follow Us On: Instagram

