కలం, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని గర్భం దాల్చడమే కాకుండా, ప్రసవించిన పసికందును ఆసుపత్రిలోని చెత్తబుట్టలో పడేసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఒక గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రస్తుతం జిల్లాలోని ఒక కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం పరీక్ష రాసిన సదరు విద్యార్థిని, కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లి ఆమెను వెంటబెట్టుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చింది.
బాలిక పరిస్థితిని గమనించిన వైద్యులు, స్కానింగ్ కోసం సమీపంలోని ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు పంపించారు. అయితే అక్కడ నిరీక్షిస్తున్న సమయంలో కడుపు నొప్పి తీవ్రం కావడంతో తల్లి తన కూతురిని పక్కనే ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్లింది. అక్కడే ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. బాత్రూంలో నుంచి శబ్దాలు రావడంతో ఆసుపత్రి సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా విస్తుపోయే దృశ్యం కనిపించింది.
అప్పుడే పుట్టిన పసికందును తల్లి, కూతురు కలిసి అక్కడే ఉన్న చెత్త బుట్టలో పడేసి ఏమీ తెలియనట్లు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

