కలం, వెబ్ డెస్క్: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ హైకోర్టు (High Court)కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంగళవారం ఉదయం హైకోర్టు అధికారిక ఈమెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. మెయిల్లో కోర్టు భవనంలో పేలుడు పదార్థాలు అమర్చినట్టు పేర్కొనడం గమనార్హం.
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే కోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హైకోర్టు ప్రాంగణానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. కోర్టు గదులు, కారిడార్లు, పార్కింగ్ ప్రాంతాలు సహా మొత్తం ప్రాంగణాన్ని పరిశీలించారు. కొంతసేపు కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి చేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. సుమారు కొన్ని గంటలపాటు కొనసాగిన తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు తేల్చారు. దీంతో ఇది తప్పుడు బెదిరింపుగా నిర్ధారించారు. భద్రతా కారణాల రీత్యా కోర్టు పరిసరాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రాథమిక దర్యాప్తులో విదేశాల్లో నివసిస్తున్న శేఖర్ అనే యువకుడు ఈమెయిల్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా అతడిని ట్రేస్ చేసినట్లు సమాచారం. శేఖర్పై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అవసరమైతే అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్కు రప్పించే చర్యలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైకోర్టుకు (High Court) ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. తరచూ తప్పుడు బెదిరింపులు వస్తుండటం భద్రతా యంత్రాంగానికి సవాలుగా మారుతోంది.
Read Also: రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్
Follow Us On: Sharechat

