కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు (Jallikattu) పోటీల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో సోమవారం జరిగిన ఈ వేడుకల్లో అదుపుతప్పిన ఎద్దులు ఒక్కసారిగా ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, సుమారు 76 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పండుగ వాతావరణంలో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ పోటీల్లో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
తమిళనాడు (Tamil Nadu) సంస్కృతికి ప్రతీకగా నిలిచే జల్లికట్టుకు దాదాపు 2,000 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రాచీన తమిళ సాహిత్యం, సింధు లోయ నాగరికత ఆధారాల ప్రకారం, దీనిని ఏరు తాజువుతాల్ (ఎద్దును ఆలింగనం చేసుకోవడం) అని కూడా పిలుస్తారు. పూర్వం ఎద్దు కొమ్ములకు నాణేల సంచులు కట్టేవారు, వాటిని దక్కించుకోవడమే ఈ క్రీడ ప్రధాన లక్ష్యం కాబట్టి దీనికి ‘జల్లికట్టు’ (Jallikattu) అనే పేరు వచ్చింది.
ఈ క్రీడ కేవలం వినోదం మాత్రమే కాదు, మేలుజాతి ఎద్దులను సంరక్షించడానికి, యువతలో ధైర్యసాహసాలను పెంపొందించడానికి ఒక మార్గంగా తమిళులు భావిస్తారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జరిగే ఈ పోటీలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తుంటారు.
Read Also: ‘అన్నారం’లో ఇసుక అక్రమ రవాణా.. ప్రభుత్వం క్లారిటీ
Follow Us On : WhatsApp

