కలం, వెబ్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ (West Indies)తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో భారత్ (India) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో విజయం సాధించి సెమీస్కు చేరుకుంది. తాజాగా ఈ మ్యాచ్లో భారత్ ఆటతీరుపై బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివర్లో దూబే కొట్టిన రెండు ఫోర్లు మ్యాచ్ను మలుపు తిప్పాయని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో శివమ్ దూబే ఆడిన చిన్న ఇన్నింగ్స్ అసలైన టర్నింగ్ పాయింట్ అని అన్నాడు.
హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే, కేవలం 4 బంతుల్లో 8 పరుగులు చేశారు. భారత్ గెలవడానికి 10 బంతుల్లో 17 పరుగులు కావాల్సిన దశలో, దూబే తన మొదటి బంతికే ఫోర్ కొట్టి టెన్షన్ను తగ్గించారు. 19వ ఓవర్ చివరి బంతికి మరో ఫోర్ బాదడంతో, ఆఖరి ఓవర్లో భారత్ లక్ష్యం 7 పరుగులకు చేరుకుంది. దీనిని సంజూ శామ్సన్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశారు.
బౌలింగ్లోనూ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తన 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి షిమ్రాన్ హెట్మెయర్, రోస్టన్ ఛేజ్లను ఒకే ఓవర్లో అవుట్ చేసి విండీస్ ఇన్నింగ్స్ను దెబ్బతీశారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో వేగాన్ని తగ్గించి, వైవిధ్యమైన బంతులతో పరుగులు రాకుండా అడ్డుకున్నట్లు బుమ్రా వివరించారు. అజేయంగా 97 పరుగులు చేసి భారత్ను గెలిపించిన సంజూ శామ్సన్ గురించి బుమ్రా ప్రత్యేకంగా మాట్లాడారు.
గత నెల రోజులుగా సంజూ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, జట్టులోకి వస్తూ వెళ్తూ ఉండటం ఆటగాడి మనస్తత్వంపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అయినప్పటికీ పట్టుదలతో ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం సంతోషకరమని, ఆయన మరిన్ని విజయాలు సాధించాలని బుమ్రా ఆకాంక్షించారు. ఈ విజయంతో భారత్ మార్చి 5, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరు కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

