కలం, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా దేశాలు అధికారిక ప్రకటన లేకుండా యుద్ధం చేసి ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Khamenei)ని హత్య చేయడాన్ని భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) తీవ్రంగా ఖండించింది. ఈ సంక్షోభ సమయంలో ఖమేనీ కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా సమాజానికి సంఘీభావంగా నిలుస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటన విడుదల చేశారు.
అధికారిక యుద్ధ ప్రకటన లేకుండా ఒక సార్వభౌమ దేశాధినేతపై దాడి చేసి, హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కాంగ్రెస్ పేర్కొంది. భారత విదేశాంగ విధానం శాంతి, సంభాషణ, అంతర్జాతీయ చట్టాల గౌరవంపై ఆధారపడినదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రకారం వివాదాలను శాంతియుత మార్గంలో పరిష్కరించడం భారత విధానమని గుర్తు చేసింది. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి సూత్రాలు భారత నాగరికత విలువలలో భాగమని పేర్కొంది.
ఇలాంటి లక్ష్యబద్ధ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్కు కూడా వ్యతిరేకమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఐరాస చార్టర్లోని ఆర్టికల్ 2(4), 2(7) ప్రకారం ఒక దేశ భౌగోళిక సమగ్రత లేదా రాజకీయ స్వతంత్రతపై బలప్రయోగం చేయరాదని స్పష్టంగా ఉందని తెలిపింది. ప్రపంచం ఒక కుటుంబం అన్న భావన, అలాగే మహాత్మా గాంధీ ప్రతిపాదించిన అహింస సిద్ధాంతం, జవహర్ లాల్ నెహ్రూ విధానం వంటి విలువలకు ఈ సంఘటన విరుద్ధమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఏ దేశ ప్రజలైనా తమ రాజకీయ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటారని, బాహ్య శక్తులు పాలనా మార్పులు చేయడానికి ప్రయత్నించడం సామ్రాజ్యవాద ధోరణి అని కాంగ్రెస్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

