కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి నిరసనగా జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ (Srinagar)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారనే వార్తలతో ఆగ్రహించిన వేలాది మంది షియా ముస్లింలు శ్రీనగర్ వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శన చేపట్టారు. ఇరాన్ పట్ల తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ, ఈ దాడులకు పాల్పడిన దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శ్రీనగర్లోని హసనాబాద్, హదీ గంజ్ వంటి షియా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిరసనకారులు ఖమేనీ చిత్రపటాలను చేతపట్టుకుని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ దాడిని ప్రపంచ ముస్లిం సమాజంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి వార్త వెలువడినప్పటి నుండి కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో సంతాప దినాలు పాటిస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా శ్రీనగర్ అంతటా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనలు ఉధృతమవడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

