కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రతి సోమవారం డైరెక్టర్ ఎండోమెంట్స్ కార్యాలయంలో “ధర్మవాణి” (Dharmavani) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఇందులో భాగంగా దేవాదాయ ధర్మాదాయశాఖలోని సమస్యలను పరిష్కరించనున్నారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు, అర్చకులు లేదా ఇతరులు ఎవరైనా సరే డైరెక్టర్ ను కలవొచ్చు. “ధర్మవాణి” కార్యక్రమంలొ సమస్యలను తక్షణమే లేదా గరిష్టంగా వారం రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
శాఖ ప్రధాన కార్యాలయం, డీసీ, ఏసీ, ఈఓ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న పనులను కూడా పరిష్కరించనున్నారు. దరఖాస్తు పరిష్కారమైన తర్వాత సంబంధిత వ్యక్తులకు కార్యాలయం నుండి సమాచారం అందజేస్తామని డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కరించలేని సమస్యల విషయంలో ఎందుకు పరిష్కరించలేకపోయామో కూడా వివరంగా తెలియజేస్తామని తెలిపారు.

