కలం, వెబ్ డెస్క్: ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను (Super Six Schemes) సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నేడు హెచ్పీవీ వ్యాక్సినేషన్ (HPV Vaccination) కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గర్భాశయ కేన్సర్ రాకుండా బాలికలందరూ ఈ వ్యాక్సిన్స్ వేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే జీవితాంతం రక్షణ ఉంటుందని తెలిపారు. టీకా వేయించుకునేందుకు వచ్చిన బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడిని సీఎం వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం రావివలసలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని సీఎం ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, ఏమైనా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజల ఫోన్కే ఏఐ డాక్టర్ కూడా వస్తాడని సీఎం చెప్పారు. ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదు, మెడిసిన్ ఎలా వేసుకోవాలని అన్నీ చెప్తారన్నారు. ఊరూరా డిజిటల్ హెల్త్ రికార్డులు కూడా పెట్టామన్నారు. 104, 108 సేవలు ఊరూరా వస్తాయన్నారు. మెడికల్ టెస్టులు చేసి రికార్డులన్నీ పెడతామన్నారు. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లాలన్నా సెల్ ఫోన్లో రికార్డుతో చూపించుకోవచ్చని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు ఎక్కువ తినేస్తున్నారని, అందుకే లేనిపోని వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. పంటల సాగులో పురుగు మందుల వినియోగం పెరిగిపోయిందని చెప్పారు. అందుకే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. అన్నం ఎక్కువ తింటే షుగర్ వస్తుందని, అది అన్ని రోగాలకు గేట్ వేగా మారుతుందని చెప్పారు.
ఏదైనా నిర్లక్ష్యం చేస్తా కానీ, పేద వాళ్లను నిర్లక్ష్యం చేయనని చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు అన్ని హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో కనీసం ప్రజలు నవ్వడానికి కూడా వీల్లేదని, చప్పట్లు కూడా కొట్టేందుకు వీళ్లేదని, ఇండ్లల్లో సురక్షితంగా ఉండే అవకాశం ఉండేది కాదని సీఎం అన్నారు. ఒకరోజు తననే జైలులో పెట్టారని, అయినా కుంగిపోలేదని చెప్పారు. ప్రజల కోసమే పని చేశానని, ప్రజల కోసమే ముందుకు వెళ్లానని పేర్కొన్నారు. ఈ రోజు సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశామని, ఇంత గొప్పగా పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని తెలిపారు. 62.76 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. రూ.33 వేల కోట్లు పెన్షన్లకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొచ్చామని, ఆర్టీసీ బస్సులో ఇప్పుడు ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. స్త్రీ శక్తి కింద 47 కోట్ల ప్రయాణాలు జరిగాయని చెప్పారు. మరోవైపు పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. అన్నదాత సుఖీభవతో రైతులకు అండగా నిలుస్తున్నామని సీఎం అన్నారు.
Read Also: ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి : గరికిపాటి నరసింహారావు
Follow Us On : WhatsApp

