కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) సెమీఫైనల్ రేసు అత్యంత ఆసక్తికరమైన దశకు చేరుకుంది. శ్రీలంకపై న్యూజిలాండ్ సాధించిన భారీ విజయం పాకిస్థాన్ ఆశలను గాలిలో దీపంలా మార్చేసింది. ప్రస్తుతం పాక్ సెమీస్ చేరాలంటే సొంత విజయంతో పాటు ఇతరుల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన క్లిష్ట స్థితి నెలకొంది. శ్రీలంకపై కివీస్ 61 పరుగుల తేడాతో గెలవడంతో వారి నెట్ రన్ రేట్ (NRR) భారీగా పెరిగి +3.050 కి చేరింది. అదే సమయంలో పాకిస్థాన్ రన్ రేట్ -0.464 వద్దే ఉంది. ఈ స్థితిలో పాక్ ముందడుగు వేయాలంటే కచ్చితంగా అద్భుతం జరగాల్సిందే.
సెమీస్ రేసులో నిలవాలంటే తన చివరి మ్యాచ్లో శ్రీలంకపై పాకిస్థాన్ కనీసం 70 పరుగుల తేడాతో గెలవాలి. అయినా, అది సరిపోదు.. న్యూజిలాండ్ తన తర్వాతి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడిస్తే, అప్పుడు పాకిస్థాన్ లంకపై 50 పరుగుల తేడాతో గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, కివీస్ నేరుగా సెమీస్కు వెళ్తుంది.. పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.
కాగా, బుధవారం సూపర్8 మ్యాచ్లో(T20 World Cup 2026) టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 168 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ 47 పరుగులు, రచిన్ రవీంద్ర 32 పరుగులతో రాణించారు. ఛేదనలో శ్రీలంక కేవలం 107 పరుగులకే పరిమితమై 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆతిథ్య శ్రీలంక సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన రచిన్ రవీంద్రకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. పాకిస్థాన్ జట్టు సెమీస్కు చేరుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. వారి భవితవ్యం ఇప్పుడు పూర్తిగా నెట్ రన్ రేట్, ఇతర జట్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది.

