కలం, డెస్క్ : మేఘాలయ (Meghalaya) అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది. భర్త అని కూడా చూడకుండా అందరి ముందే ప్రశ్నల వర్షం కురిపించింది ఓ భార్య. ఇంతకీ విషయం ఏంటంటే.. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఆయన భార్య, ఎమ్మెల్యే అయిన మెహతాబ్ చందీ ఎ.సంగ్మా మధ్య అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. భర్త సీఎం అయినా సరే అందరి ముందే సమస్యలపై ప్రశ్నించారు మెహతాబ్. సీఎం కూడా తన భార్య అడిగిన ప్రశ్నలకు అదే విధంగా సమాధానాలు ఇచ్చారు.
రాష్ట్రంలోని చాలా వెటర్నరీ కాలేజీల బిల్డింగులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ఆమె ప్రశ్నించారు. ఒక వెటర్నరీ, రెండు ఫిషరీస్, ఒక డెయిరీ కాలేజీ ఇంకా నత్త నడకన సాగుతున్నాయని.. దీని వల్ల స్టూడెంట్లు, రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలపై స్పందించిన సీఎం కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కువ మంది పాడి పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నారని.. వారి అవసరాలను గుర్తించి మూడు కాలేజీలను అత్యవసరంగా కంప్లీట్ చేస్తున్నట్టు తెలిపారు. మిగతా వాటిని కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అయితే అందులో సిబ్బంది కొరత కొంత ఉందని.. త్వరలోనే రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. వీరిద్దరి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

