కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో అవుట్గోయింగ్ శిక్షణార్థుల కోసం ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా ఉపాధి మరియు శిక్షణశాఖ డైరెక్టర్ ఎన్.కాంతి వెస్లీ, సంగారెడ్డి (Sangareddy) జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కాంతి వెస్లీ మాట్లాడుతూ… ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ప్రారంభించిందని.. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. పరిశ్రమల వాస్తవ పని పరిస్థితులపై అవగాహన కల్పించడం, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాల మెరుగుదల ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యమని కాంతి వెస్లీ పేర్కొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటే స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ ఏటీసీ సెంటర్లు యువత ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 13 విభిన్న ట్రేడ్స్కు చెందిన 279 మంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమలు ఎంపిక చేసిన శిక్షణార్థులకు ఆఫర్ లెటర్లు అందజేశారు. ఎంపికైన వారికి రూ.10,000 నుండి రూ.15,500 దాకా స్టైఫండ్ తో ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ అవకాశాలు కల్పించారు.

