కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చెవి నొప్పితో చేరిన 23 ఏళ్ల యువకుని ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని.. యువకుడి బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో నిరసన తెలిపారు. భీంగల్ మండలం పల్లికొండ (Pallikonda) గ్రామానికి చెందిన గంగం అజయ్ (23) చెవిలో చీము కారడంతో నిజామాబాద్ (Nizamabad) లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అతనిని పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసేందుకు నిర్ణయించారు. అనుకున్నట్లే అజయ్కి శస్త్ర చికిత్స చేశారు. కానీ సర్జరీ జరిగిన తరువాత అతను నోరు మెదపడం లేదు. ఉలుకూ పలుకు లేకపోవడంతో డాక్టర్ హుటాహుటిన పేషెంట్ అజయ్ని సమీపంలో ఉన్న మరో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనితో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు.. ముందుగా చేర్చిన ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుటే మృతదేహాన్ని దహనం చేసేందుకు డిజిల్ క్యాన్తో రావడం కలకలం రేపింది. ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించకుండా వైద్యున్ని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

