కలం, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలోని బాసర త్రిపుల్ ఐటీ (RGUKT Basar)లో విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్ హాస్టల్ గదిలో వసంత అనే ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన యువతిగా అధికారులు గుర్తించారు. బుధవారం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు వేలాడుతున్న వసంతను గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.
విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచుతూ, మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వసంత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. చదువు ఒత్తిడి కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడిందా లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాల కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

