కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో మళ్లీ గొడవలు చెలరేగాయి. వామపక్ష మద్దతు గల స్టూడెంట్స్ యూనియన్స్, ఏబీవీపీ విద్యార్థి సంఘం పరస్పరం తలపడ్డాయి. రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. జేఎన్యూ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్యూ వీసీ శాంతిశ్రీ ధూళిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ విక్టిమ్ కార్డును ఎల్లప్పుడూ ఉపయోగించవడం వల్ల కొన్ని వర్గాలు పురోగతి చెందలేవు’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కులవివక్షను ఎగతాళి చేసేలా ఉన్నాయంటూ వామపక్ష మద్దతు గల జవహరల్లా నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్యూ) ‘సమతా జులూస్’ పేరుతో ఆదివారం అర్ధరాత్రి(తెల్లవారితే సోమవారం) ర్యాలీకి దిగింది.
తన వ్యాఖ్యలపై వీసీ క్షమాపణ చెప్పాలని, అలాగే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్లోని ఈస్ట్ గేట్ నుంచి వీసీ ఛాంబర్ వద్దకు ప్రదర్శనగా విద్యార్థులు వెళ్లారు. అక్కడ నినాదాలు చేస్తూ గుమికూడి ఉండగా, వాళ్ల మీద ఎక్కడి నుంచో రాళ్లు పడ్డాయి. దీంతో వాళ్లు సమీపంలోనే ఉన్న ఏబీవీపీ విద్యార్థులపైకి దూసుకెళ్లారు. ఈక్రమంలో రెండు వర్గాలవాళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. అధికారులు, పోలీసులు రావడంతో కాసేపటికి పరిస్థితి సద్దుమణిగింది.
ఈ దాడులకు మీరంటే మీరు కారణమంటూ ఆ తర్వాత రెండు వర్గాలు ఆరోపణలు చేసుకున్నాయి. ముసుగు వేసుకున్న కొందరు తమపై రాళ్లతో దాడి చేస్తున్న వీడియోలను లెఫ్ట్వింగ్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి బదులుగా తమపైనా రాళ్ల దాడి జరిగిందంటూ ఏబీవీపీ కార్యకర్తలు వీడియోలు పెట్టారు. మొత్తానికి కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న జేఎన్యూలో(JNU) మళ్లీ విద్యార్థి సంఘాల మధ్య అల్లర్లు చెలరేగడం కలకలం రేపుతోంది.
Read Also: క్యాబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పరిధిలోకి ఆ ఉద్యోగులు
Follow Us On: Sharechat


