కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, హనుమకొండ బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) ఆరోపించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు జనతా గ్యారేజ్లాగా పని చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని, ఈ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడం లేదని చెప్పారు. రైతులకు కనీసం సాగు నీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇటీవల జరిగిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీ కోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తానని చెపుతున్నారని, అదంతా ఎవరి సొమ్ము అని వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ప్రశ్నించారు.
కేరళలో జరిగే ఎన్నికల ఫండ్ కోసమే..
కేవలం కేరళ (Kerala)లో జరిగే ఎన్నికల ఫండ్ కోసమే దేవాదుల ప్రాజెక్ట్ (Devadula Project) నిర్మాణంపై సమీక్షలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును 2027 డిసెంబర్ చివరికల్లా పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పారని వెల్లడించారు. గతంలో 2024 ఆగస్ట్ 21న పూర్తి చేస్తామని సీఎం, 2025న పూర్తి చేస్తామని మంత్రులు చెప్పారని గుర్తు చేశారు. ఒకే ప్రభుత్వం, మంత్రివర్గం ఇన్నిసార్లు మాటలు మార్చడం, ప్రజలను ఏమార్చడమే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి విహారాయత్రకు వచ్చినట్టు 50 నిమిషాలు పర్యటన చేసి వెళ్లిపోయాడని, కనీసం ఒక్క పూట కూడా సమీక్ష చేయలేని నేతలు వరంగల్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దేవాదుల మూడో ఫేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.17,000 కోట్ల అంచనా వేసి ఇప్పుడు రూ.24,000 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. పెంచిన రూ.7 వేల కోట్లలో కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ వేల కోట్లు దండుకోనుందని ఆరోపించారు.
రెండేళ్లు దాటినా తట్టెడు మట్టి తీయలేదు..
వరంగల్ జిల్లాకు హరీష్ రావు వచ్చి 24 గంటలు గడవకముందే సీఎం ఆగమేఘాల మీద గాలిలో వచ్చి గాలిలోనే వెళ్లిపోయారని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలకు, మంత్రుల మాటలకు, ఎమ్మెల్యేల మాటలకు పొంతన లేదన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందుకు ఘన్పూర్లో కడియం శ్రీహరి కి పిండాలు పెట్టే కార్యక్రమాలు చేయబోతున్నట్లు తెలిపారు. కేసీఆర్ రూ.7 వేల కోట్లు కేటాయించి అసంపూర్తిగా ఉన్న దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2లను పూర్తి చేసి, ఫేజ్ 3 ప్రణాళికలు పనులు ప్రారంభించారన్నారు. దేవాదుల మోటార్లు ఆన్ చేయలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు జానకి రాములు, చందర్, అఫ్జల్, మట్టపెల్లి రమేష్, పులి రజినీకాంత్, నార్లగిరి రమేష్, జనార్థన్ గౌడ్, దశరథం, రఘు, నయీమొద్దీన్, కోటిలింగం, వినోద్ కుమార్, రామ్మూర్తి, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రేమ పెళ్లితో కుల బహిష్కరణ.. ఊరిలో శుభకార్యాలకు నో ఎంట్రీ..!
Follow Us On: Sharechat


