కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం జరగనున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ మొదలు పలు కీలక అంశాలపై చర్చల అనంతరం నిర్ణయం జరగనున్నది. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మూడవ వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటిలోగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల్లోని అనుకూల ప్రతికూల అంశాలను చర్చించిన తర్వాత క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. దీనికి తోడు జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపైనా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపైనా ప్రభుత్వం అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక స్పష్టతకు రానున్నది.
రైతుభరోసా నిధుల విడుదలపై.. :
ప్రస్తుత సీజన్కు రైతులకు విడుదల చేయాల్సిన రైతుభరోసా నిధులపైనా క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. గత సీజన్లో ఒకే తొమ్మిది రోజుల్లోనే నిధులను విడుదల చేసినందున ఈసారి కూడా అదే తరహాలో ఇవ్వాలని భావిస్తున్నది. రాష్ట్ర బడ్జెట్ తయారీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ తదితరాలకు అనుగుణంగా క్యాబినెట్లో చర్చ అనంతరం ప్రకటన వెలువడనున్నది. దీనితో పాటే ‘వంద రోజుల అభివృద్ధి ప్రణాళిక’, ‘సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు’, తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అంశానికి సంబంధించి బిల్లు తయారీ.. వీటిపైనా క్యాబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశమున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.
సిటీ మెట్రో రైల్ టేకోవర్పైనా చర్చ :
ప్రస్తుతం ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేయనున్నది. దీనిపైన పాలసీ డెసిషన్ జరిగిపోయినా ఫైనాన్షియల్, టెక్నికల్గా మరికొన్ని ఫార్మాలిటీస్ మిగిలిపోవడంతో దానిపైన మంత్రివర్గం చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. ఈక్విటీ, రుణాలు, నష్టాలు తదితరాల రూపంలో సుమారు రూ. 15 వేల కోట్ల మేర రాష్ట్ర ఖజానాపై భారం పడనున్నది. ఈ నిర్ణయం ద్వారా సెకండ్ ఫేజ్ పనులకు, కేంద్రం నుంచి అనుమతులకు చిక్కులు తొలగనున్నాయి.
బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు :
రాబోయే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించనున్న వార్షిక బడ్జెట్, ప్రభుత్వ ప్రాధాన్యాలు, వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, నిధుల సమీకరణకు అనుగుంగా చేయనున్న కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితరాలపైనా క్యాబినెట్ భేటీలో చర్చ జరగనున్నది. తొలుత ఈ నెల 26 నుంచే సమావేశాలు నిర్వహించేలా రెండు వారాల క్రితం ముసాయిదా షెడ్యూలు తయారుచేసుకున్నా ఆ తర్వాత పరిస్థితులను బట్టి అది మార్చి థర్డ్ వీక్కు మారినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ ఎన్నికల పోలింగ్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తేదీలు ఖరారు కానున్నాయి.
Read Also: యాదాద్రి దర్శనం చాలా కాస్ట్లీ గురూ.. ప్యాకేజ్ని బట్టి వరాలు
Follow Us On : WhatsApp


