కలం, మెదక్ బ్యూరో : కొత్తగా ఎన్నికైన సంగారెడ్డి (Sangareddy) మున్సిపల్ పాలకవర్గ సభ్యులు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి కలెక్టర్ పి.ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. పాలకవర్గంలో యువతీ, యువకులు ఎక్కువగా ఉన్నారని, ఇది మున్సిపాలిటీకి చాలా ప్రయోజనం కలిగిస్తుందన్నారు కలెక్టర్. క్షేత్ర స్థాయికి వెళ్లి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని, పరిష్కరించాలని కౌన్సిలర్లకు సూచించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని కలెక్టర్ ప్రావీణ్య హామీ ఇచ్చారు. సంగారెడ్డి మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, మెరుగైన పారిశుద్ధం, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, ఇలా అన్ని సదుపాయాలు కల్పించడానికి సహకరించాలని కలెక్టర్ ను కొత్త పాలకవర్గం కోరారు.


