కలం, వెబ్ డెస్క్: నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న బాలిక మిస్సింగ్ కేసు (Minor Girl Missing Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై ఓ గంజాయి బ్యాచ్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి సేవించిన ముగ్గురు రౌడీ షీటర్లు బాలికకు కూడా గంజాయి ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. చెంగిచెర్లలో బాలికను గుర్తించగా ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బాధిత బాలిక(16) పుప్పాలగూడలో తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం స్కూలుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలిక సాయంత్రం 4 గంటలైనా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన అమ్మమ్మ తమ బంధువులకు విషయం చెప్పింది. కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో బాలిక కోసం గాలించారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దారుణం వెలుగుచూసింది. సదరు బాలిక 16వ తేదీన తనకు పరిచయమున్న బాలుడితో కలిసి చార్మినార్ వెళ్లింది. అతడు మాయమాటలు చెప్పి బాలికను చెంగిచెర్లకు తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు రౌడీ షీటర్లతో కలిసి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో భవానీ నగర్కు చెందిన రౌడీ షీటర్ అస్లాం కూడా ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ అయ్యిన వారిలో ఓ నిందితుడిపై మర్డర్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


