కలం, వెబ్ డెస్క్ : నేడు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నేడు తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉదయం 10-30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో, ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై అధిష్టానం చర్చించనుంది. ఈ కీలక భేటీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్న ఏఐసీసీ, అందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు, క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు ఈ భేటీలో ప్రధాన చర్చకు రానున్నాయి. వీటితో పాటు రాబోయే కాలంలో రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు తీరు, మంత్రులు, సీనియర్ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాల వంటి సున్నితమైన అంశాలను కూడా అధిష్టానం పరిశీలించి, నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.


