కలం, వెబ్ డెస్క్: కేంద్రం, రాష్ట్రాల సంబంధాలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం చెన్నైలోని శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండాలని, దీనికోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రం అన్ని అధికారాలనూ తన చేతుల్లోనే ఉంచుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కోసమూ కేంద్రంతో పోరాడాల్సిన దుస్థితిలో ఉన్నాం. వాళ్లు ఇస్తే మనం తీసుకునే స్థితిలో ఇంకెంతకాలం ఉండాలి? అంతేకాదు.. భూమి, ఆర్థిక అధికారాలపై హక్కులు సాధించేందుకు ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేశాం. ఆ కమిటీ ఫస్ట్ రిపోర్ట్ను అసెంబ్లీలో సమర్పించాం. రాష్ట్రాలను పూర్తి అధికారాలతో కూడిన ప్రభుత్వాలుగా మార్చేందుకు రాజ్యాంగ సవరణ అవసరం. అన్ని రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండాలి’ అని ఆయన (MK Stalin) స్పష్టం చేశారు.
భిన్నత్వం కలిగిన దేశానికి సమాఖ్య వ్యవస్థే పునాది అని పేర్కొన్నా స్టాలిన్.. కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ బలోపేతం కావాలని, అదే సమయంలో రాష్ట్రాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించాలనీ పునరుద్ఘాటించారు. ‘అన్ని అధికారాలనూ తనవద్దే ఉంచుకున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను గౌరవించడం లేదు. వాళ్లు ఇస్తే మనం స్వీకరించే స్థితిలో ఇంకా ఎంతకాలం కొనసాగాలి? రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి, కేంద్రంలో సమాఖ్య విధానం ఉన్నప్పుడే మంచి పరిపాలన సాధ్యమవుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ డిమాండ్ మాత్రమే కాదని ఆయన స్పష్టంచేశారు. రాజకీయ భేదాభిప్రాయాలకు అతీతంగా స్వయంప్రతిపత్తి అవసరాన్ని అన్ని రాష్ట్రాలూ గుర్తించాలని ఆయన కోరారు.
Read Also: విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ
Follow Us On : WhatsApp


