కలం, వెబ్ డెస్క్: మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి మృతిపై టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు (Palla Srinivasa Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లల జోలికి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో భయంతోనే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. తునిలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తు చేశారు. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన కులవర్ధన్ నేడు చెరువులో శవమై తేలాడు. అతడు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం లేదా వ్యక్తులు ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం జరగదని ఆయన అన్నారు. ఏదైనా చట్ట పరిధిలోనే జరుగుతుందని తెలిపారు. కులవర్ధన్ వంటి సైకోల పట్ల ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఎవరి ప్రవర్తన ఎలా ఉందన్న దానిపై సమాజం కూడా గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రజలకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆగ్రహం రావడం సహజమేనన్నారు. పెంపకంలో లోపాలు ఉన్నప్పుడు, మానసిక ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు.


