కలం, వెబ్ డెస్క్: కమల్ హాసన్ (Kamal Haasan) స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి భారత ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఎంఎన్ఎం పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తూ ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పుదుచ్చేరిలో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ గుర్తును కేటాయించినట్లు వెల్లడించింది.
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులు టార్చ్లైట్ గుర్తుతోనే ఎన్నికల బరిలోకి దిగనున్నారు. గుర్తింపుపొందని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ప్రత్యేక గుర్తులను కేటాయించే ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికి స్పందించిన ఎంఎన్ఎం పార్టీ ప్రతినిధులు ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పది గుర్తులతో కూడిన జాబితాను సమర్పించారు. వాటిలో ఒక గుర్తును కేటాయించాలని అభ్యర్థించారు. పరిశీలన అనంతరం టార్చ్లైట్ గుర్తును పార్టీకి కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుతో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకే గుర్తుతో ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఓటర్లలో పార్టీ గుర్తింపును మరింత బలపర్చాలనే వ్యూహంతో ఎంఎన్ఎం ముందుకు సాగుతోంది. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన, ప్రజాకేంద్రీకృత రాజకీయాలే లక్ష్యంగా 2018లో కమల్ హాసన్ (Kamal Haasan) మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) పార్టీని స్థాపించారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా పార్టీని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు ఎంఎన్ఎం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
Read Also: ప్రత్యూష విషాదాంతం.. అలుపెరుగని అమ్మ పోరాటం
Follow Us On : WhatsApp


