కలం, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినట్లుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. “ప్రజల దయతో తెలంగాణ జాగృతి ఒక ఆర్గనైజేషన్గా నిలబడింది. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేశాం. మమ్నల్ని, మా అభ్యర్థుల్ని ప్రజలు మంచిగా ఆదరించారు.. దీవించారు.. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ జాగృతి పోటీ చేస్తుంది. పోటీలో ఉంటాం.. నిలబడతాం.. కానీ ఏ గుర్తుపై పోటీ చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలేదు. నాకు కూడా తెలియదు. ఎలక్షన్ ప్రాసెస్, పేపర్ వర్క్ జరుగుతూ ఉన్నది.” అని అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజనులతో కలిసి పాల్గొన్న ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
పార్టీ పొత్తుపై కసరత్తు షురూ :
మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జాగృతి కొన్ని వార్డుల్లో విజయం సాధించింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో (Waddepally Municipality) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉండడంతో అది తేలేంత వరకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని కామన్ సింబల్ మీద పోటీ చేయాలన్నది జాగృతి ఉద్దేశం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీచేస్తుందా?.. లేక కొత్త పార్టీతో సంప్రదింపులు జరుపుతుందా?.. అనేది జాగృతి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విద్యార్థులకు వార్షిక పరీక్షల షెడ్యూలు ఉన్నందున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఆ తర్వాతనే నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వ్యక్తం చేశారు.
Read Also: ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్య? నటి తాప్సి వీడియో వైరల్
Follow Us On : WhatsApp


