కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు (Bengaluru) నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హోసకోట్ దేవనహళ్లి(Hosakote Devanahalli) హైవే సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నవారు స్పందించి.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపించారు.
పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల సమాచారం ప్రకారం.. రెండు కార్లు, ఒక కాంటర్ వాహనం, ఒక ద్విచక్ర వాహనం పరస్పరం ఢీకొనడంతో ఈ చైన్ యాక్సిడెంట్ జరిగింది. వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండగా.. మబ్బులు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.


