కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సొంత మండలం భీంగల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality)లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలోని మెజారిటీ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఈ విజయం ప్రజల ఆశయాల గెలుపు అని అన్నారు. భీంగల్ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. భీంగల్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన భీంగల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం మరింత విస్తరించిందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కట్టుదిట్టంగా పనిచేస్తామని పేర్కొన్నారు.


