కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక మున్సిపాలిటీని కోల్పోయింది. సూర్యాపేట జిల్లా పరిధిలో ఉండే తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తిరుమలగిరి (Thirumalagiri Municipality)లో కాంగ్రెస్ ఓటమిని ఎదుర్కొన్నది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మందల సామియేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన పరిధిలో ఉండే తిరుమలగిరిలో కాంగ్రెస్ ఓడిపోవడం పార్టీకి ఊహించని దెబ్బ.
ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పతనం అవుతూ ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నా అనూహ్యంగా తిరుమలగిరిలో జెండా ఎగరేయడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో సూర్యాపేట మినహా మిగిలినవన్నీ కాంగ్రెస్ గెలుచుకున్నది. రెవెన్యూపరంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న తిరుమలగిరి మున్సిపాలిటీలో (Thirumalagiri Municipality) బీఆర్ఎస్ గెలవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తన సత్తాను చాటుకున్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట కూడా బీఆర్ఎస్ను గెలిపించుకున్నానని ఆయన క్రెడిట్ కొట్టేయడానికి అవకాశం లభించినట్లయింది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా తిరుమలగిరి మినహా మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్ పైచేయి సాధించింది. తిరుమలగిరి చేజారిపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సామియేలు డిఫెన్సులో పడినట్లయింది. మరోవైపు సూర్యాపేట ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ట్రెండ్స్ ఇంకా బయటకు రాలేదు.


