epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

డైరెక్టర్ రాజమౌళిపై మూడు కేసులు

వారణాసి(Varanasi) టైటిల్ రిలీజ్ ఈవెంట్ అనంతరం ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) హిందూ సంఘాలకు టార్గెట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. తాను దేవుడిని నమ్మనని.. నాస్తికుడినని ఆయన చెప్పుకున్నారు. అంతేకాక తన వెంట హనుమంతుడు ఉంటాడని తన తండ్రి తరుచూ చెబుతుంటారని.. కానీ హనుమంతుడు తన వెంట లేడంటూ వ్యాఖ్యానించారు. రాజమౌళి తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నప్పటికీ అవి కాస్తా బూమరాంగ్ అయ్యాయి.

ఈ కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. కొన్ని హిందూ సంఘాలు రాజమౌళిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆయన సినిమాలను బ్యాన్ చేయాలనే స్థాయిలో కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇక రాజమౌళి మీద మొత్తం మూడు కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. మూడు విభిన్న అంశాలపై ఆయనపై కేసులు, ఫిర్యాదులు నమోదయ్యాయి.

వారణాసి సినిమా పోస్టర్‌లో నందిపై మహేష్ బాబు కూర్చున్నట్టు కనిపిస్తోంది. ఈవెంట్ లో కూడా మహేశ్ బాబు(Mahesh Babu) నంది బొమ్మ మీద నుంచి వచ్చారు. హిందువులు పవిత్రంగా పూజించే నందిపై హీరోని కూర్చోబెట్టడం అవమానకరమని పేర్కొంటూ కొందరు రాజమౌళి(Rajamouli)పై కేసు నమోదు చేశారు. ‘బాహుబలి – ది ఎటర్నల్ వార్’ ట్రైలర్ పై మరో అభ్యంతరం వ్యక్తమైంది. రాజమౌళి రూపొందిస్తున్న “బాహుబలి – ది ఎటర్నల్ వార్” యానిమేషన్ ప్రాజెక్ట్ ట్రైలర్‌ కూడా వివాదాల్లోకి చేరింది. ఈ ట్రైలర్‌లో బాహుబలి దేవేంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించారని, ఇది హిందూ దైవాలను తప్పుగా చిత్రీకరించినట్టుగా ఉందంటూ మరో కేసు నమోదైంది.

వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హనుమంతుడిని కించపరిచేలా ఉన్నాయని రాష్ట్రీయ వానర సేన ఆరోపించింది. ఈ నేపథ్యంలో సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై అధికారిక ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ మూడు వివాదాలు ఒకేసారి బయటకు రావడంతో రాజమౌళిపై ఒత్తిడి పెరిగింది. మరి ఈ కేసులు ఎంత దూరం వెళ్తాయి? రాజీ ఏమైనా కుదురుతుందా? అన్నది వేచి చూడాలి. అనవసరంగా రాజమౌళిని టార్గెట్ చేసి ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read Also: ఇకపై అలాంటి సినిమాలో చేయాలనుకుంటున్నా: దీపిక

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>