కలం, డెస్క్ : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Aravind) పోలీసులపై రెచ్చిపోయారు. కళ్లు నెత్తికెక్కాయా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఓ ఎన్నికల బూత్ వద్దకు వెళ్లిన ధర్మపురి అరవింద్ (MP Aravind).. బీజేపీ అభ్యర్థిని పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న పోలీసులతో మాట్లాడుతూ.. ‘మా అభ్యర్థిని బయటకు ఎలా పంపుతారు. ఎవరా పోలీసు.. క్యాండిడేట్ ను బయటకు పంపొద్దని తెలియదా. యూజ్ లెస్ ఫెలోస్. కళ్లు నెత్తికెక్కాయా’ అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు.
అనంతరం బీజేపీ అభ్యర్థిని తీసుకుని పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. పోలింగ్ అధికారిపై మండిపడ్డారు. ‘మా అభ్యర్థిని ఎలా బయటకు పంపుతావు. అభ్యర్థిని బయటకు పంపొద్దని నీకు ఆ మాత్రం తెలియదా. అలా పంపే అధికారం నీకు లేదు. మా క్యాండిడేట్ వీడియో తీస్తుంటే ఎందుకు వద్దు అన్నావ్. దొంగ ఓట్లు వేయిస్తున్నారు. మీకు తెలిసే అంతా జరుగుతోంది. అయినా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు. ఇలా పనిచేసే బదులు ఇంటికి వెళ్లిపోండి’ అంటూ మండిపడ్డారు ధర్మపురి అరవింద్.


