కలం, వెబ్ డెస్క్: వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)పై మరో కేసు నమోదైంది. 2023లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబురాల పేరిట లక్కీ డ్రా నిర్వహించిన ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అంబటి రాంబాబును కోర్టులో హాజరు పరచాలని జడ్జి ఆదేశించారు. ఇప్పటికే ఒక కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించినప్పటికీ, తాజాగా మరో కేసు నమోదు కావడంతో ఆయన విడుదల ప్రక్రియ ఆలస్యమవుతోంది.
జనసేన నేత గాదె వెంకటేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు (Ambati Rambabu) పై మరో పీటీ వారెంట్ పిటిషన్ కూడా దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో న్యాయ ప్రక్రియ మరింత ముందుకు సాగనుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అంబటి రాంబాబును తప్పనిసరిగా హాజరు పరచాల్సి ఉండటంతో, ప్రస్తుతం ఆయన విడుదలపై అనిశ్చితి నెలకొంది. వరుసగా కేసులు నమోదవుతుండటంతో అంబటి రాంబాబు న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


