కలం, వెబ్డెస్క్: తమిళనాడులో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధితో రాజధాని చెన్నైలో సుమారు 1500 కాకులు చనిపోయినట్లు కనుగొనడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖలు తమ సిబ్బందిని అలర్ట్ చేశాయి. కోళ్ల పెంపకందారులకు, నిర్వాహకులకు కఠినమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. వైద్యారోగ్యశాఖ కూడా ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వైద్య సిబ్బందిని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరింది. కాగా, చెన్నైలో బర్డ్ ఫ్లూ వెలుగు చూడడంతో ఆంధ్రప్రదేశ్లోని సరిహద్దు జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తమిళనాడుకు ఆనుకొని ఉండే చిత్తూరు జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు అత్యధికంగా ఉంటాయి. దీంతో వీటి యజమానులు కంగారుపడుతున్నారు.
పక్షులు, జంతువుల్లో తీవ్ర ప్రభావం..
సైంటిఫిక్ పరిభాషలో హెచ్5ఎన్1గా పిలిచే హైలీ ఫాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా(హెచ్పీఏఐ) పక్షుల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే దీన్ని బర్డ్ ఫ్లూ (Bird Flu) అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకితే పక్షులు కుప్పలుతెప్పలుగా చనిపోతాయి. ఈ ప్రమాదం ఇక్కడితో ఆగదు. ఇతర జాతుల్లోకి ప్రవేశిస్తుంది. జంతువులతోపాటు మనుషులకూ సోకుతుంది. మనుషుల్లో అంత తీవ్ర ప్రభావం కనిపించకపోయినా, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. ప్రపంచం మొత్తం ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రబలే ఈ వ్యాధి ఇటీవల తరచూ వస్తోంది. గత రెండేళ్లలోనే జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలో ఈ వైరస్ బారిన పడి ఎన్నో పక్షులు, కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ రంగానికి విపరీతమైన నష్టం కలిగింది.
Read Also: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..!
Follow Us On: X(Twitter)


