కలం, ఖమ్మం బ్యూరో : “ఎన్నికలు రాగానే చుట్టాల్లా వస్తారు.. రంగు రంగుల కండువాలు మార్చి మాయమాటలు చెబుతారు. పదేళ్లు అధికారంలో ఉండి పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేని ఆ ‘దొర’లు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. శుక్రవారం కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్వంచలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కత్తి ఒకరికిచ్చి.. యుద్ధం చేయమంటే కుదురుతుందా?
“రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రిగా మీ శీనన్న ఉన్నారు. కత్తి ఒకరి చేతికి ఇచ్చి, యుద్ధం నన్ను చేయమంటే నేను చేయలేను. ప్రభుత్వం మనదైనప్పుడే అభివృద్ధి సాధ్యం. ఓట్ల కోసం వచ్చే రకరకాల వ్యక్తుల మాయ మాటలు నమ్మకండి. అధికారం లేని వారికి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు.
పదేళ్ల అన్యాయానికి చరమగీతం పాడుదాం
“పదేళ్లుగా నా పేద చెల్లెమ్మలు ఇందిరమ్మ ఇళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆనాడు పట్టించుకోని వారు, నేడు మీ ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జిలు, అస్తవ్యస్తమైన రోడ్లే వారి అసమర్థతకు సాక్ష్యం. సర్వే నంబర్ 727 భూ సమస్యను ఏళ్ల తరబడి ఎందుకు గాలికొదిలేశారు? మీ ఇంటి పెద్ద కొడుకుగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, సాగులో ఉన్న ప్రతి నిరుపేదకు పట్టా ఇచ్చే బాధ్యత నాది.” అని మంత్రి పొంగులేటి తెలిపారు.


