కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఫిబ్రవరి 6న (శుక్రవారం) నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి జిల్లాకు వస్తుండటంతో అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటనలో భాగంగా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని కేశపూర్ గ్రామం వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బర్దిపూర్ ప్రాంతంలో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితోపాటు తెలంగాణ (Telangana) విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, జిల్లాలోని వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు సభా స్థలిని, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.


