కలం, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లా మేడారం జాతర (Medaram Jatara) లో మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. బాలికపై లైంగిక దాడి ఆరోపణలపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ బృందం గురువారం మధ్యాహ్నం ములుగు జిల్లాకు చేరుకుంది.
మొదట ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్ నాథ్ కేకన్ తో భేటీ అయి ఆరోపణలపై పలు వివరాలు సేకరించింది. అనంతరం మేడారం (Medaram) జాతర పరిసరాలలో లైంగికదాడి జరిగిందని భావిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిందని భావిస్తున్న క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించిన కమిటీ. ఈ నేపథ్యంలో జాతరలో ఎలాంటి ఘటన జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక విచారణ కమిటీ బృందం జాతీయ మహిళా కమిషన్ కు ఫైనల్ నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది.


