కలం, తెలంగాణ బ్యూరో : కొత్తగా కరెంటు కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. స్థంభాలు, వైర్లు.. అన్నీ మనమే సమకూర్చుకోవాలని భయపడుతున్నారా?.. ఖర్చు తడిచి మోపెడవుతుందని ఆందోళన పడుతున్నారా?.. ఇకపైన అలాంటి టెన్షన్లే వద్దు. ఇంతకాలం వసూలు చేసిన ఛార్జీలను ఇకపైన విధించబోమని తెలంగాణ విద్యుత్ (Power) రెగ్యులేటరీ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. గతంలో అమలైన ఛార్జీల స్థానంలో ఇప్పుడు ఫిక్స్ డ్ టారిఫ్ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ గెజిట్ జారీచేసింది. గతంలో దూరాన్ని బట్టి కరెంటు స్థంభాలు, విద్యుత్ వైర్లకు కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకున్న వినియోగదారులే ఖర్చు భరించాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా కిలోవాట్ సామర్థ్యాన్ని యూనిట్గా తీసుకుని ప్రజలపై భారాన్ని తగ్గించేలా విద్యుత్ నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీచేసింది.
కొత్తగా అమల్లోకి వచ్చే గైడ్లైన్స్ ప్రకారం.. ఒక కిలోవాట్ సామర్థ్యంతో గృహ విద్యుత్ కనెక్షన్ను తీసుకోవాలనుకుంటే కేవలం రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ సంభాలు (Power Poles), వైర్లు.. వీటన్నింటినీ విద్యుత్ డిస్కంలే చూసుకుంటాయి. ఒకవేళ ఎక్కువ రూములు ఉండే పెద్ద ఇల్లు కట్టుకుంటే, లేదా ఏసీలు, హీటర్లు లాంటి ఉపకరణాలతో ఒక కిలోవాట్ కంటే ఎక్కువ కరెంటు వాడేలా కనెక్షన్ కావాలనుకుంటే ఫిక్స్ డ్ టారిఫ్గా రూ. 500తో పాటు ఒక్కో కిలోవాట్కు రూ. 600 చొప్పున గరిష్టంగా ఐదు కిలోవాట్ వరకు మొత్తంగా రూ. 3,500 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ బహుళ అంతస్తుల భవనం లేదా అపార్టుమెంటు లాంటివి కట్టుకుని 20 కిలోవాట్ కరెంటు వాడాల్సి వస్తే ఫిక్స్ డ్ టారిఫ్గా రూ. 2,900 చెల్లించడంతో పాటు ఒక్కో కిలోవాట్కు అదనంగా రూ. 1,500 చొప్పున చెల్లించాలి. ఇండ్లతో పాటు షాపులు, షో రూమ్లు, పరిశ్రమలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. ఇలా వివిధ రకాల కమర్షియల్ అవసరాలకు కూడా కొత్త టారిఫ్ను ప్రభుత్వం గెజిట్లో వెల్లడించింది.
Read Also: ఆపరేషన్ కియా.. కశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
Follow Us On : WhatsApp


