కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జూబిలీహిల్స్ ఇంట్లో నిర్వహిస్తోన్న విందు కార్యక్రమం (Revanth Dinner Meet) హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మెనూలో కేవలం ఫుడ్ ఐటమ్స్ మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలు కూడా ఉన్నాయి. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అడుగుపెట్టిన సీఎం కొద్దిసేపు విరామం తీసుకున్న అనంతరం పాలనాపరమైన విధుల్లో నిమగ్నమయ్యారు. నేటి రాత్రి పార్టీ కీలక నేతలు, మంత్రులతో విందు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించిన హై-లెవెల్ స్ట్రాటజీ సమీక్షగా మారనున్నట్టు స్పష్టమవుతోంది.
ఈ డిన్నర్ ఎందుకంత స్పెషల్?
రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ నాయకులు, మంత్రివర్గ సభ్యులతో మొదటిసారి ఫేస్ టు ఫేస్ భేటీ అవుతున్నారు. ఇంతకుముందు జూమ్ మీటింగ్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలపై సమీక్షలు, సర్వేలు, బీ ఫార్మ్స్ పంపిణీ వంటి అంశాలపైన చర్చలు జరిపారు. ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యూహం, ప్రచార సభలు, బూత్ లెవల్ కార్యకర్తల సమన్వయం, స్థానిక సమస్యలపైన ఫోకస్ పెట్టే చాన్స్ ఉంది.
పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి?
సీఎం రేవంత్ (CM Revanth) అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. ఆయన లేకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో మంత్రులు భేటీ అవడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సీఎం లేని కారణంగానే పాలనాపరమైన అంశాలను నాతో చర్చించేందుకు ముగ్గురు మంత్రులు వచ్చారని భట్టి క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ పార్టీలో అంతర్గత విబేధాలున్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దీంతో ఈ డిన్నర్ మీటింగ్ (Dinner Meet) ద్వారా పార్టీలో ఐక్యతను తెలియజేయాలని సీఎం భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ ఎదుర్కొనేందుకు బలమైన వ్యూహాలను రూపొందించనున్నారు. రేపటి నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సమావేశంలో సభలు సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ డిన్నర్ మీటింగ్ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కి చాలా కీలకం కానుంది.
ప్రతిష్టాత్మకంగా మున్సి’పోల్స్’
తెలంగాణలో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి జరగనున్న మున్సిపల్ ఎన్నికలు (Telangana Municipal Elections) ఎంతో ప్రతిష్టాత్మకం. అందునా పంచాయతీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కొంతమేర బలం పుంజుకున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో అలర్టైన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన హస్తం పార్టీ… ఇప్పుడు పట్టణస్థాయిలోనూ తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా మంత్రులకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం, నమ్మకమైన కార్యకర్తలకే బీ ఫార్మ్స్ అందించాలని ఇప్పటికే సీఎం ఆదేశాలివ్వడం వంటివి జరిగాయి. అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యత డీసీసీలతో పాటు స్థానిక మంత్రులదేనని ఆయన తేల్చి చెప్పారు. మరోసారి ఈ అంశంపైన నేతలను ఆయన హెచ్చరించే అవకాశం ఉంది. సర్వేలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, మంచి మెజారిటీతో గెలుస్తామని సీఎం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: సీపీఐ అభ్యర్థికి టికెట్.. కాంగ్రెస్ నాయకుల నిరసన
Follow Us On: Instagram


